17-10-2025 12:00:00 AM
రానున్న రోజుల్లో దేశంలో ఒలంపిక్ క్రీడలు : ఎంపీ రఘునందన్రావు
పటాన్చెరు, అక్టోబర్ 16 : 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలు పటాన్ చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నిరంతరం క్రీడల అభివృద్ధిని కాంక్షించే పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆతిథ్యంలో 33 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు క్రీడా జ్యోతిని అందించగా ముఖ్య అతిథులుగా హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ ప్రావిణ్య, ఎస్పీ పరతోష్ పంకజ్, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలు క్రీడాజ్యోతిని వెలిగించి, క్రీడా పతాకాన్ని ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. అనంతరం శాంతి కపోతాలను ఎగురవేశారు. అనంతరం క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు, ఆయా జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్, సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
ఎమ్మెల్యే గూడెం కృషి అభినందనీయం : ఎంపీ రఘునందన్రావు
రాష్ట్రస్థాయి క్రీడలను పటాన్ చెరు వేదికగా నిర్వహించడం పట్ల స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని మెదక్ ఎంపీ రఘునందన్రావు అభినందించారు. నిరంతరం క్రీడల అభివృద్ధిని కాంక్షించే ఎమ్మెల్యే లభించడం పటాన్ చెరు ప్రజల అదృష్టం అన్నారు.150 కోట్ల జనాభా కలిగిన భారత దేశంలో క్రీడాకారుల ప్రాతినిధ్యం అతి స్వల్పమన్నారు. 2036 ఒలింపిక్స్ క్రీడలను భారతదేశంలో నిర్వహించేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని కోరారు.
క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే జీఎంఆర్
పటాన్ చెరు నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో జాతీయ క్రీడలకు సైతం పటాన్ చెరు వేదికగా నిలువబోతోందని సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో మినీ స్టేడియాలు నిర్మించి క్రీడాకారులకు భరోసా అందిస్తున్నామనితెలిపారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ.. రాష్ట్ర జాతీయస్థాయి క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారుల కోట ద్వారా ప్రథమ ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు.