8 April, 2026 | 1:58 AM

బడంగ్‌పేట్ అవినీతి కుంభకోణం

08-04-2026 12:21 AM

సిట్ లేదా సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్

బడంగ్పేట్, ఏప్రిల్ 7(విజయక్రాంతి): బడంగ్పేట్ మున్సిపల్ సర్కిల్లో వెలుగుచూసిన రూ.150 కోట్ల భారీ అవినీతిపై భారతీయ జనతా పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే డిప్యూటీ కమిషనర్ సరస్వతి తో సహా 9 మంది అధికారులు సస్పెండ్ కావడం సంచలనం సృష్టిస్తోంది. ఈ దోపిడీ కేవలం అధికారులకే పరిమితం కాలేదని, దీని వెనుక బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నేతల హస్తం ఉందని బీజేపీ క్లస్టర్ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

పనులు చేయకుండానే టెండర్లు మంజూరు చేయడం, బాలాపూర్ పాఠశాల బాత్రూం మరమ్మతుల పేరుతో రూ. 40 లక్షలు కాజేయడం వంటి అక్రమాలను బీజేపీ ఎండగట్టింది. తాము చేసిన ఫిర్యాదుల వల్లే ఈ అవినీతి బాగోతం బయటపడిందని, దోషులు దొరికిపోతారనే భయంతోనే కాంగ్రెస్ నేతలు బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నారని వారు మండిపడ్డారు.సస్పెండ్ అయిన అధికారులు నోరు విప్పి అసలు సూత్రధారులను బయటపెట్టాలి.

ఈ కేసును సిట్  లేదా సీబీఐ తో నిష్పక్షపాతంగా విచారణ చేయించాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశారు.అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం తో పాటు ప్రజల నుండి దోచుకున్న సొమ్మును పూర్తిగా రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.ధర్నాలో బీజేపీ మాజీ కార్పొరేటర్లు, వివిధ క్లస్టర్ల అధ్యక్షులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని, అవినీతి అంతమయ్యే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.