టీచర్లకు రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలి
స్పాట్ రెమ్యూనరేషన్ చెల్లించాలి
ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డిమాండ్
సంగారెడ్డి, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు సంగారెడ్డిలో నిర్వహిస్తున్న పదవ తరగతి మూల్యాకన కేంద్రాల వద్ద భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాల మూడు ఐక్యవేదికలు జాక్టో, యుఎస్పిఎస్సి, టిటిజెఏసీల రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 2025 మార్చిలో నిర్వహించిన పదవ తరగతి మూల్యాంకన విధుల రెమ్యూనరేషన్, అక్టోబర్ 2024లో నిర్వహించిన కులగణన రెమ్యూనరేషన్ చెల్లింపులు చేపట్టాలని ఐక్యవేదిక డిమాండ్ చేసింది. పదవ తరగతి మూల్యాంకన రెమ్యూనరేషన్ పెంపు, ఈ సంవత్సరం నిర్వహిస్తున్న స్పాట్ రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
వివిధ డిమాండ్లతో కూడిన విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వానికి నివేదించుటకు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పక్షాన జిల్లా విద్యాశాఖ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో జాక్టో చైర్మన్ శ్రీనివాస రాథోడ్, టిటిజెఎసి జిల్లా అధ్యక్షులు మాణయ్య, యూఎస్పీఎస్సీ నాయకులు అశోక్, సాయిలు, టి పి టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్, నాయకులు సోమశేఖర్, లక్ష్మారెడ్డి, ప్రభు రవి, ప్రసాద్, రమేష్, దత్తాత్రి ,సుధాకర్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నేత చంద్రశేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




