శ్రీరామనవమి వేళ.. 48 ఆవులను కాపాడిన భజరంగ్ దళ్, హిందూ వాహిని సభ్యులు
రెండు కంటైనర్ లో 48 ఆవులు తరలింపు..
షాద్నగర్,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో అక్రమంగా ఆవులను తరలిస్తున్న రెండు కంటైనర్లను భజరంగ్ దళ్, హిందు వాహిని సభ్యులు పట్టుకున్నారు. పట్టుకున్న కంటైనర్లలోని ఆవులను చౌడమ్మ గుట్ట గోశాలకు తరలించారు. అక్రమంగా భారీ కంటైనర్లలో గురువారం రాత్రి తరలిస్తున్న ఆవులను షాద్ నగర్ హిందు వాహిని సభ్యులు పట్టుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా తోరణాలను కడుతున్న హిందు వాహిని, బజరంగ్దళ్ సభ్యులకు మూడు కంటైనర్లు అనుమానాస్పదంగా అగుపించాయి.
వీరిని చూసిన కంటైనర్ డ్రైవర్లు వాహనాలను ఆపకుండా వెళ్లడంతో భజరంగ్ దళ్, హిందు వాహిని సభ్యులు కంటైనర్లను వెంబడించి రెండు కంటైనర్లను పట్టుకున్నారు. కంటైనర్లలో తరలిస్తున్న 48 ఆవులను మున్సిపాలిటీలోని చౌడమ్మ గుట్ట గోశాలకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం యువకులు పెద్ద ఎత్తున చౌడమ్మ గుట్ట గోశాల వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. దీంతో షాద్ నగర్ ఏసిపి లక్ష్మీనారాయణ ఇరువర్గాలను చెదరగొట్టారు.




