07-06-2025 10:03:35 AM
ఈద్గా వద్ద పోలీసు బందోబస్తు
మైనార్టీలకు ఏసీపీ రవికుమార్ శుభాకాంక్షలు
అశోక్ నగర్ ఈద్గావద్దసామూహిక ప్రార్ధనలు
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): భక్తిశ్రద్ధలతో బక్రీద్(Bakrid Celebrations) వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. అశోక్ నగర్ ఈద్గా వద్ద సామూహిక ప్రార్ధనలు చేశారు. పట్టణంలోని ముస్లిం సోదరులంతా అశోక్ నగర్ ఈద్గా వద్దకు ఉదయo 9 గంటలకు చేరుకున్నారు. వందలాదిమంది ముస్లిం సోదరులు పిల్లాపాపలతో సామూహిక ప్రార్థనల కోసం తరలి వెళ్లారు.
ఎలాంటి అవాంఛనియ సంఘటనలకు తావు లేకుండా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్హెచ్ఓ దేవయ్య ఆధ్వర్యంలో పోలీసులు ఈద్గా వద్ద బందోబస్తును నిర్వహించారు. సామూహిక ప్రార్థనలు ముగిసే వరకు ఏసీపీ రవికుమార్ ఈద్గా వద్ద ప్రత్యక్షంగా ఉండి బందోబస్తును పర్యవేక్షించారు. బక్రీద్ పండుగ సందర్భంగా సామూహిక ప్రార్థనలకు విఘాతం కలగకుండా పోలీసులు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అశోక్ నగర్ ఈద్గా వైపు రహదారిలో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. బెల్లంపల్లిలో ప్రశాంతంగా బక్రీదు పర్వదిన వేడుకలు ముగిసాయి.