09-08-2024 12:05:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న ఇంటి నంబర్లకు శాస్త్రీయత లేదని, జీహెచ్ఎంసీ చేపడుతున్న జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) సర్వే ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో క్యూఆర్ కోడ్ కలిగిన ఇంటి నంబర్లను కేటాయించనున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. గ్రేటర్లో ప్రస్తుతం కొనసాగుతున్న జీఐఎస్ సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఐటీ విభాగం అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్తో కలిసి గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రేటర్లో ప్రజలకు మెరుగైన సేవలందించడానికి పట్టణ ప్రణాళిక, వనరుల నిర్వహణను మెరుగు పర్చడంపై దృష్టి సారించినట్టు చెప్పారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటి నంబర్లతో స్విగ్గీ, జొమోటో, ఫ్లిప్కార్ట్ తదితర ఆన్లైన్ సేవలు పొందడంలో పౌరులు తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారని అన్నారు. ‘మా ఇంటి పక్కవాళ్లకు ఇవ్వాల్సిన చికెన్ను డెలివరీ బాయ్ మా ఇంటి వద్ద వేసి వెళ్తున్నాడంటూ’ కమిషనర్ స్వీయ అనుభవాన్ని చెప్పుకొచ్చారు. మీ ఇంటి నంబర్ మీకు గుర్తుందా అంటూ ఓ విలేకరిని ప్రశ్నించారు. గ్రేటర్వ్యాప్తంగా నడస్తున్న జీఐఎస్ సర్వే ముందుగా అనుకున్న ట్టుగా 18 నెలల్లో కాకుండా 6 నెలల్లో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. ఈ మొత్తానికి రూ. 22 కోట్ల వ్యయం వెచ్చిస్తున్నట్టు తెలిపారు.
త్వరితగతిన సేవలు
ఈ సర్వే అనంతరం జీఐఎస్ డిజిటల్ బోర్డును ప్రతి ఇంటి ముందు ఉంచుతామన్నారు. దీని ద్వారా జనన, మరణ ధ్రువీ కరణ పత్రాలతో పాటు ఆస్తుల మ్యూటేషన్, ప్రభుత్వ సేవలను ఇంటి నుంచే పొందే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా విపత్తుల సమయంలో అధికారులు త్వరితగతిన నేరుగా వెళ్లి సేవలు అందిస్తారన్నారు. ప్రభు త్వ స్థలాలు, చెరువులు, కుంటలు తదితర ఆస్తులు కబ్జాలకు గురికాకుండా నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆస్తులు, యుటిలిటీస్ అన్నీ ఒకే దగ్గర అందుబాటులో ఉండేలా మ్యాపింగ్ చేయడానికి జీఐఎస్ సర్వే చేపడుతున్నట్టు తెలిపారు.
ఈ సర్వేలో ప్రభుత్వ భూములు, చిన్న పెద్ద రహదారులు, చెరువులు, సరస్సులు అన్నింటినీ శాటిలైట్ మ్యాపింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీని కోసం వినియోగిస్తున్న కొత్త టెక్నాలజీతో హైదరాబాద్ నగరాన్ని దేశానికి రోల్మోడల్గా రూపొందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గల గ్రేటర్లో మొత్తం 19.43 లక్షల నిర్మాణాలు ఉన్నాయని, వీటిలో 2.7 లక్షల కమర్షియల్ నిర్మాణాలు ఉన్నట్టు వివరించారు.
ప్రాపర్టీ ట్యాక్స్ పెంచడం కోసం కాదు
గ్రేటర్లోని హైదర్నగర్, మియాపూర్, చందానగర్, కేపీహెచ్బీ కాలనీ, ఉప్పల్, హయత్ నగర్లో జీఐఎస్ సర్వే ప్రారంభమైందన్నారు. శాటిలైట్, గ్రౌండ్ రిపోర్టు ద్వారా సర్వే చేస్తున్నామని, ఇప్పటి వరకు 130 చదరపు కిలోమీటర్లలో డ్రోన్ సర్వే పూర్తయిందని వెల్లడించారు. ఈ సర్వేపై ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావొద్దన్నారు. ఈ సర్వే ప్రాపర్టీ ట్యాక్స్ పెంచడం కోసం కాదని స్పష్టం చేశారు.
మా ఇంట్లోని చెత్తను కూడా తీసుకెళ్లడం లేదు
గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడపడితే అక్కడ చెత్త నిల్వలు పేరుకుపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలకు మరింత బలం చేకూరేలా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మీడియా సమావేశంలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మొత్తం జీహెచ్ఎంసీ పనితీరుపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రేటర్లోని ఇళ్లల్లో చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదంటూ స్వయంగా కమిషనర్ హోదాలో ప్రకటించడం విశేషం. ‘మా ఇంట్లో కూడా చెత్త సేకరణ జరగడం లేదు.. స్వచ్ఛ ఆటోలు రాకపోవడంతో మా ఇంట్లో కూడా చెత్త సమస్యను ఎదుర్కొంటున్నామని’ కమిషనర్ చెప్పారు. అదేవిధంగా రాత్రి 12 గంటల సమయంలో ఫలానా వీధిలో స్ట్రీట్ లైట్లు పనిచేయడం లేదంటూ తనకు ఫిర్యాదులు వస్తున్నట్టు కమిషనర్ తెలియజేశారు.