02-08-2025 01:54:09 AM
గోదావరి నదీ జలాలను ఏపీకి తరలించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు.. తెలంగాణ పాలిట మరణశాసనంగా మారబోతున్నది. గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు పేరుతో గోదావరి జలాలను ఏపీకి తరలించడానికి అక్కడి కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ ఎడారిగా మారబోతోందని బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి ‘ బనకచర్ల ప్రాజెక్టు పేరిట ఏపీ చేస్తున్న జల దోపిడి- కాంగ్రెస్’ మౌనం అనే అంశంపై ఇటీవల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బనకచర్లను ఆపడానికి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆయన విమర్శించారు.
అలాగే ఢిల్లీలో జరిగిన భేటీలో బనకచర్లపై కమిటీ ఏర్పాటుకు సీఎం రేవంత్రెడ్డి ఆమోదం తెలిపి తెలంగాణకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన బనకచర్ల పూర్వాపరాలు, దాని చరిత్ర, ప్రస్తుత స్థితి ఇది.
ఏమిటీ బనకచర్లప్రాజెక్టు?
* కృష్ణా జలాల తరహాలోనే గోదావరి జలాలు చెరబట్టేందుకు ఏపీ కుతంత్రం
* రోజుకు 2 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 200 టీఎంసీలు తరలింపు
* రూ.80,112 కోట్లతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ వేగవంతమైన చర్యలు
* 150 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బొల్లపల్లి వద్ద భారీ కృత్రిమ జలాశయం ప్రతిపాదన
* కృష్ణ, పెన్నా బేసిన్ ప్రాంతాల సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం నీటి సరఫరా
ఏపీ చెబుతున్న కారణాలు.. చంద్రబాబు దబాయింపు..
* గోదావరి వరద జలాలనే వాడుకుంటున్నాం.
* తెలంగాణ ప్రాజెక్టులకు గతంలో నేను ఎన్నడూ అడ్డు చెప్పలేదు.
* ఇతర రాష్ట్రాలు బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు చెప్పడం లేదు.
తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్న చంద్రబాబు ప్రభుత్వం!
* కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేయాలని, పనులు తక్షణం నిలిపివేయాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ.
* అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా, విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ కాళేశ్వరం కడుతున్నారంటూ ప్రాజెక్టును అడ్డుకోవాలని చంద్రబాబు కుటిల ప్రయత్నం.
తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్న ఏపీ ప్రభుత్వం!
* ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీటిని అందించే భక్త రామదాసు ప్రాజెక్టును అడ్డుకునేందుకు 2017లో కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ.
* గోదావరిపైనే కాకుండా కృష్ణా బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు అనేక లేఖలు రాసిన నాటి ఏపీ ప్రభుత్వం
* పాలమూరు-రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, కల్వకుర్తి, నెట్టెంపాడు, సుంకిశాల ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్ర జలవనరుల శాఖ, కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీకి అనేక లేఖలు రాసిన నాటి ఏపీ ప్రభుత్వం.
* పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను అడ్డుకోవాలని 2016లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి చంద్రబాబు లేఖ.
* ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగు, తాగు నీరు అందించే తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు నాటి ఏపీ ప్రభుత్వం లేఖ.
ఏపీ పునర్విభజన చట్టానికి తూట్లు..
* గోదావరి/కృష్ణా బోర్డుల అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్లో చర్చ లేదు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు.
* ఇవేవీ లేకుండా నేరుగా ప్రాజెక్టు పనులు పిలవడానికి ఏపీ సిద్ధం అవుతున్నది.
* నియంత్రించాల్సిన కేంద్రం నిధులు సమకూర్చుతూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నది.
200 టీఎంసీలను హక్కుగా మార్చుకునే కుట్ర
* ఐఎస్డబ్ల్యూఆర్డీ యాక్ట్ 1956, సెక్షన్ 3 ప్రకారం గోదావరి ట్రిబ్యునల్ను వేయమని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ఇదివరకే ఆర్జీ పెట్టుకున్నది.
* గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో జలదోపిడీకి చంద్రబాబు కుట్ర (రిపేరియన్ రైట్స్)
* బనకచర్ల ప్రాజెక్టు పనులను ముందుగానే ప్రారంభించి, నిధులు ఖర్చు చేసి 200 టీఎంసీల నీటిని కేటాయించాలని గోదావరి ట్రిబ్యునల్ ముందు వాదించే ప్లాన్.
* గోదావరి బేసిన్లో ఉమ్మడి ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన 969 టీఎంసీల వాటాలను ఇప్పటికీ వ్యతిరేకిస్తున్న ఏపీ.
200 టీఎంసీల్లో తెలంగాణాకు వాటా?
* కృష్ణా అవార్డులో ఉన్నట్లు గోదావరి అవార్డులో నికర జలాలు, వరద జలాలు అన్న కాన్సెప్ట్ లేదు. గోదావరి అవార్డులో వాడిన పదం ఆల్ వాటర్స్. అవి ఏవైనా కావచ్చు. కాబట్టి పోలవరం నుంచి కృష్ణా బేసిన్కు తరలించే నీటికి బదులుగా కృష్ణా జలాల్లో తెలంగాణాకు వాటా పొందే హక్కు ఉన్నది.
* గోదావరి అవార్డు ప్రకారం, 80 టీఎంసీలకు మించి గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు తరలించినట్లయితే, అందుకుగాను 45:21:14 నిష్పత్తిలో కృష్ణా జలాల్లో వాటాను ఎగువ రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక మహారాష్ట్రలకు ఇవ్వవలసి ఉంటుంది.
* అంటే కృష్ణా జలాల్లో తెలంగాణాకు అదనంగా 112.5 టీఎంసీల వాటా ఇవ్వాలి.
* పోలవరం ద్వారా తరలించే గోదావరి నీటికి బదులు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణ జలాల్లో గోదావరి అవార్డు ప్రకారం రావలసిన వాటా 45+112.5= 157.5 టీఎంసీలు
* దీన్ని డిమాండ్ చేయాల్సిన ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి మౌనం.
భవిష్యత్తులో బనకచర్ల సామర్థ్యం 400 టీఎంసీలకు పెంచుకునే కుట్ర
* 200 టీఎంసీల నీళ్లను దోచుకోవడమే కాక భవిష్యత్తులో దాన్ని 400 టీఎంసీలకు పెంచుకుంటామని కేంద్రానికి సమర్పించిన నివేదికలో స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం.
* కేంద్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం రెండూ కలిసి తెలంగాణను ఎడారిగా మార్చే కుట్ర చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చేతలూడిగి చూస్తున్నది
* పాలమూరు డిండి ప్రాజెక్టులను అడ్డుకోవాలని 2016లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి చంద్రబాబు లేఖ.
తెలంగాణ అంగీకారం లేకుండానే కేంద్ర సహకారంతో గోదావరి-బనకచర్ల లింక్ పనులు వేగవంతం..
* నదుల అనుసంధాన ప్రాజెక్టులను చేపట్టే ముందు ఆ నది బేసిన్లో ఉండే రాష్ట్రాల అనుమతి కోసం కన్సల్టెన్సీ మీటింగ్ను కేంద్ర జలవనరుల శాఖ నిర్వహించాలి.
* జూన్ 12న హైదరాబాద్ జలసౌధలో జరగవలసిన గోదావరి-కావేరి కన్సల్టెన్సీ మీటింగ్ను రద్దు చేసి అదేరోజు గోదావరి-బనకచర్ల-కావేరి లింక్ ప్రాజెక్టు టాస్క్ఫోర్స్ మీటింగ్ ఢిల్లీలో నిర్వహణ.
* గోదావరి-కావేరి కన్సల్టెన్సీ మీటింగ్ను రద్దు చేసి, హడావిడిగా టాస్క్ఫోర్స్ మీటింగ్ నిర్వహించింది గోదావరి-బనకచర్ల లింక్ కోసమేనా?
* గతంలో బీజేపీ పాలిత చత్తీస్ఘడ్ రాష్ట్రం వ్యతిరేకిస్తే గోదావరి-కావేరి లింక్ను సమ్మక్క సాగర్ వద్ద నిర్మాణాన్ని నిలిపివేసిన కేంద్రం.. గోదావరి-బనకచర్ల లింక్కు ఎలాంటి అనుమతులు లేకుండా సూత్రప్రాయంగా అంగీకరించడమంటే తెలంగాణకు తీరని అన్యాయం చేయడమే.
* సమ్మక్క సాగర్ నుంచి గోదావరి-కావేరీ అనుసంధానం చేపడితే తెలంగాణ భూభాగానికి 75 టీఎంసీల వాటా దక్కుతుంది.
* ఈ కుట్ర వల్ల తెలంగాణ 75 టీఎంసీల నీటిని నష్టపోతుంది.
బనకచర్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి..
* బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతోందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ పార్టీ.
* అప్పుడు మేల్కొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్యాక్ డేట్(22-01-2025)తో కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాశారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం నివేదికలు సమర్పించిందా? అని లేఖలో అడిగారు.
* నాలుగు నెలల తర్వాత 28 మే నెలలో స్వయంగా జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమాధానం ఇస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి నివేదకలను ఇవ్వలేదన్నారు.
* కానీ సీడబ్ల్యూసీ ప్రాజెక్ట్ అప్రైజల్ సౌత్ డైరెక్టర్ రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 23 మే నాడు బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ప్రి ఫీజబిలిటీ రిపోర్ట్ను సమర్పించిందని స్పష్టం చేశారు.
* పక్క రాష్ట్రం నీటి దోపిడీ చేసినా, కేంద్రం అబద్దాలాడినా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మాటా కూడా మాట్లాడదు, ఏపీ కుట్రలను నిలువరించదు.
Soori