19-11-2025 10:20:57 PM
ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అంబులెన్సుల అవసరం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటి అవసరం ప్రతీరోజూ ఉంటూనే ఉంటుంది. తాజాగా బంధన్ బ్యాంకు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద దేశవ్యాప్తంగా 10 అంబులెన్సులను విరాళంగా ఇచ్చింది. 10వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. వివిధ వర్గాలకు ఆరోగ్య సంరక్షణ సేవలు, అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చే దిశగా 10 అంబులెన్స్లను విరాళంగా అందించింది. దీనిలో భాగంగా తెలంగాణలోని సికింద్రాబాద్ భారత్ సేవాశ్రమ్ సంఘ్కి బంధన్ బ్యాంక్ స్వతంత్ర డైరెక్టర్ శంతను ముఖర్జీ అంబులెన్స్ ను లాంఛనంగా అందజేశారు. అత్యవసర పరిస్థితుల్లో పేషంట్లకు సకాలంలో వైద్య సేవలు అందేలా చూసే క్రమంలో ఆరోగ్య సంరక్షణ సర్వీసుల లభ్యతను మెరుగుపర్చేందుకు తాము దీనిని బాధ్యతగా భావించినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భారత్ సేవాశ్రమ్ సంఘ్ కార్యదర్శి స్వామి మునీశ్వరానందాజీ, అసిస్టెంట్ సెక్రటరీ స్వామి వెంకటేశ్వరానందాజీ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. బెంగళూరు, అహ్మద్నగర్, అహ్మదాబాద్, వదోదర, ఢిల్లీ, జైపూర్, అక్బర్పూర్, జలంధర్, కోల్కతా, మరియు సికింద్రాబాద్ సహా దేశవ్యాప్తంగా ప్రముఖ వైద్య సంస్థలు మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థలకు అంబులెన్స్లు విరాళంగా అందించినట్టు వెల్లడించారు. వివిధ రాష్ట్రాలవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, ఆస్పత్రులకు మద్దతు కల్పించడాన్ని తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్టు బంధన్ బ్యాంక్ ఎండీ , సీఈవో పార్థ ప్రతిమ్ సేన్గుప్తా తెలిపారు. మహిళలు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యసంరక్షణ, విద్య, జీవనోపాధిపై ప్రధానంగా దృష్టి పెడుతూ 14 రాష్ట్రాలవ్యాప్తంగా 82 జిల్లాల్లోని 25 లక్షలకు పైగా కుటుంబాలకు బంధన్ బ్యాంక్ యొక్క సీఎస్ఆర్ కార్యక్రమాలు చేరాయని తెలిపారు.