బెయిల్పై బండివి చౌకబారు వ్యాఖ్యలు
సుప్రీం తీర్పుకు అవమానం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆగ్రహం
హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూ రు చేయటంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మంగళవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ సుప్రీంకోర్టుకు ఉద్ధేశాలు ఆపాదించేలా వ్యాఖ్యలు చేసిన సంజయ్ తీరును తప్పుబట్టారు. ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయటం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విజయమంటూ బండి చేసిన ట్వీట్పై కేటీఆర్ తీవ్ర ఆగ్రభం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్లకు కంగ్రాట్యులేషన్స్ అంటూ కేంద్రమంత్రి స్థాయిని మరిచి సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసేలా బండి సంజయ్ కామెంట్స్ చేశారు. బండి సంజయ్ ట్వీట్కు స్పందిస్తూ కేంద్రమంత్రిగా ఉంటూ ఇంత చౌకబారుగా మాట్లాడతారా? అని విమర్శించారు. ఇలా దురుద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.






