28-06-2025 12:20:55 AM
ఫ్రైడే.. డ్రై డే జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, జూన్ 27(విజయక్రాంతి): అర్హులైన నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించాలనే ప్రభుత్వ ఉద్దేశమని, ఫ్రైడే డ్రై డే పటిష్టంగా అమలు పరచాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెద్దశంకరంపేట్ మండలం కమలాపూర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులను పరిశీలించి, గ్రామంలోని పరిసరాలను ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో సంబంధిత అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 9 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, 4,500 ఇండ్లు గ్రౌండింగ్ చేయడం జరిగిందని తెలిపారు. కొన్ని ఇండ్లు పిల్లర్ స్థాయిలో ఉన్నాయని, మండలంలో ఇండ్ల నిర్మాణ ప్రక్రియకు లబ్ధిదారులు మొగ్గు చూపుతూ ఇండ్లు మొదలు పెడతామని ముందుకు వస్తున్నారని, బేస్మెంట్ పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లకు పంచాయతీ సెక్రెటరీ ద్వారా ఫోటో తీసి పంపిన వారం రోజుల్లోనే లబ్ధిదారుని ఎకౌంట్లో రూ. లక్ష జమవుతున్నాయని తెలిపారు. అనంతరం గ్రామంలో ఫ్రై డే-డ్రై డే కార్యక్రమాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి , సీజనల్ వ్యాధుల నివారణకు అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు. డెంగీ, మలేరియా వంటి ప్రమాదకరమైన విష జ్వరాల వల్ల అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.