13-06-2025 12:00:00 AM
బంజారా గిరిజన జేఏసీ నాయకుడు డాక్టర్ వెంకటేష్ చౌహన్
ముషీరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): బంజారా సమాజ ఆత్మగౌరానికి ప్రతికగా రాష్ట్ర క్యాబినెట్ లో బంజారాలకు ఒక స్థానం కేటాయించాలని బంజారా గిరిజన జేఏసీ నాయకులు డాక్టర్ వెంకటేష్ చౌహన్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతీ క్యాబినెట్లో బంజారాలకు స్థానం ఉండేదని, నేడు లేకపోవడం బాధాకరమన్నారు.
ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బంజారా గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశం లో డాక్టర్ రాజేష్ నాయక్ తో కలసి ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన 65 స్థానాలు బంజారాలు బలంగా ఉన్న నియోజకవర్గాలే ఉన్నాయని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి వన్ సైడ్గా ఓటు వేసిన సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అని బంజారాలు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండే సమాజం అని తెలియజేశారు. బంజారా సమాజం నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఎమ్మెల్యేకైనా అవకాశం ఇవ్వాలని కోరారు. మూడావత్ కార్తీక్ నాయక్, శ్రీమాన్ నాయక్, జె.డి నాయక్, ధరావత్ వినోద్ నాయక్, ఐతరాజు అభయ్, అనిల్ చారి, కొండ్రపల్లి రమేష్, మహేష్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.