12-06-2025 11:48:40 PM
భాగ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్..
ఖైరతాబాద్ (విజయక్రాంతి): భాగ్యనగరంలోని చాంద్రాయణగుట్ట, యాకత్ పుర, చార్మినార్, మలక్ పేట తదితర నియోజకవర్గాలకు చెందిన 1,730 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తక్షణమే మంజూరు చేయాలని భాగ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్(Bhagyanagar Welfare Association) అధ్యక్షులు కానుగుల్ల శ్రీనివాన్, కార్యవర్గనభ్యులు శేషు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బాధితులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ లబ్ధిదారులకు జి.ఒ. 10 ప్రకారం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం కుదరదని ఈ నెల 9న హైకోర్టు తీర్పు ఇచ్చిందని వెల్లడించారు. దీంతో నాలుగు నియోజకవర్గాలకుచెందిన 1,730 మంది లబ్ధిదారులకు అన్యాయం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 2న ఈ నియోజకవర్గాల లబ్దిదారులకు మొదటి జాబితా లోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మహేశ్వరం మండలకేంద్రంలో కేటాయించిందని తెలిపారు.
కానీ, కోర్టు తీర్పుతోవారంతా ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. మూడవ జాబితా లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించారు కానీ, మొదటి జాబితా లో ఉన్న తమకు ఇప్పటివరకు ఇండ్లు కేటాయించకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 20ఏండ్లుగా పైగా తాము ఇంటి కోసం పోరాడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, ఈ 1730 మంది లబ్దిదారులకు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను 20 రోజుల్లోనే పరిష్కరించాలని కోరారు. సమావేశంలో డబుల్ బెడ్రూమ్ బాధితులు ఇబ్రహీం, శ్రీనివాస్, శ్రీవిద్య, సుభాష్, కౌనర్ బేగం తదితరులు పాల్గొన్నారు.