14-07-2025 08:53:24 PM
మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలవండి..
ములుగు జిల్లా ఎస్పీ సమక్షంలో 5 మంది నిషేధిత సీపీఐ మావోయిస్టులు లొంగుబాటు..
ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ బెటాలియన్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం సంయుక్తంగా చేపట్టిన పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అనే అవగాహన కార్యక్రమం ఫలితంగా అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ కల్పిస్తున్న పునరావాస సదుపాయాల గురించి తెలుసుకొని నక్సలిజాన్ని విడిచిపెట్టి ప్రశాంతమైన జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ హోదాలలో పనిచేస్తున్న ఐదుగురు సభ్యులు(ఇందులో ఇద్దరు మహిళలు) సోమవారం ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్(District SP Dr. Shabarish) సమక్షంలో లొంగిపోయారు. వీరిలో ఒకరు ఏసీబీ హోదాలో నలుగురు పార్టీ సభ్యులుగా ఉన్నారు. ఈ సంవత్సరం జనవరి 2025 నుండి ఇప్పటివరకు, ములుగు జిల్లాలో మొత్తం 73 మంది మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ హోదాల్లోని సభ్యులు జనజీవన స్రవంతిలో కలిశారు.
వీరిలో డీవీసీఎం 3,ఏసీఎం 10, పీఎం 22, మిలీషియా సభ్యులు 29,ఆర్పీసీ సభ్యులు 1,డీఏకేఎం 2, సీఎన్ఎం సభ్యులు 6 మంది ఉన్నారు. వీరందరికీ పునరావాస పథకానికి అనుగుణంగా తగిన సదుపాయాలు ప్రభుత్వం ద్వారా అందించబడుతున్నాయి మావోయిస్టు పార్టీ రోజు రోజుకూ క్షీణిస్తున్న పరిస్థితిని చూస్తూ, క్రింది స్థాయి క్యాడర్లు పై స్థాయి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ రహస్య ఉద్యమ జీవితాన్ని వదిలి తాము కూడా కుటుంబాల వెంట శాంతియుత జీవితాన్ని గడపాలని భావిస్తున్నారు. ఇదే కారణంగా ఇప్పటివరకు ములుగు జిల్లాలోనే 73 మంది సాయుధ మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులు జనజీవన స్రవంతిలో కలిశారు.
అడవుల్లో ఉన్న ఆదివాసీ గ్రామాల ప్రజలు మావోయిస్టులకు సహకరించడం మానేయడంతో ఆహార పదార్థాలు కూడా అందక క్యాడర్ల ఆరోగ్యం క్షీణించిందని తెలుస్తోంది. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నడవడానికి కూడా శక్తి లేనంతగా శారీరక పరిస్థితి దిగజారినట్టు తెలుస్తుంది. వీరిలో 90% పైగా క్యాడర్లు నిరుపేద ఆదివాసీలు. తమ కుటుంబాల అభివృద్ధి కోసం మావోయిస్టు పార్టీని వీడి ప్రజాస్వామ్య ప్రభుత్వాల మార్గంలో అభివృద్ధికి భాగస్వాములవుతున్నారు. ఇది నిజంగా శుభపరిణామం. మావోయిస్టు పార్టీలో ఇంకా ఉన్న సభ్యులకు విజ్ఞప్తి మీరు కూడా“పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి”అనే నినాదాన్ని నమ్మి జనజీవన స్రవంతిలో కలవండి. ఇప్పటివరకు లొంగుబాటు చేసిన 73మంది సాయుధ సభ్యులకు లక్షల రూపాయల నగదు రివార్డులు, తక్షణ సహాయంమరియు పునరావాస సదుపాయాలు అందించబడ్డాయి.
తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి పట్ల బలమైన నిబద్ధతను ఉన్నది. పోలీసు శాఖ కూడా తన వంతు బాధ్యతగా కృషి చేస్తున్నది. కర్రెగుట్టల అటవీ ప్రాంతాల్లోని ఆదివాసీలు తమ సంపదను స్వేచ్ఛగా ఉపయోగించుకునేలా పోలీసు శాఖ మరియు కేంద్ర బలగాలు అవసరమైన పోలీసు క్యాంపులు ఏర్పాటు చేయనున్నాయి. ఆదివాసీ ప్రజలకు విజ్ఞప్తి మీరు నమ్మకంతో కానీ, భయంతో కానీ మావోయిస్టులకు సహకరిస్తే, మీ ప్రాంతాలు అభివృద్ధి చెందవు. అభివృద్ధి కేవలం ప్రజాస్వామ్య ప్రభుత్వాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రజల శాంతియుత జీవనం, అభివృద్ధి మా పోలీసు శాఖ ధ్యేయం. ఈరోజు లొంగిపోయిన 05 మంది మావోయిస్టు సభ్యులకు తక్షణంగా ప్రతి ఒక్కరికి రూ.25,000 చొప్పున మొత్తం రూ.1,25,000/- ఇవ్వబడింది. తదుపరి వారి హోదాల ఆధారంగా మిగిలిన మొత్తం రూ.6,75,000/-ను ఆధార్ కార్డు మరియు బ్యాంక్ ఖాతా వివరాలు అందిన అనంతరం వారి ఖాతాల్లో చెక్కుల రూపంలో జమ చేయబడుతుంది పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలవండి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.