ప్రజావాణికి 75 ఫిర్యాదులు..
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్..
ములుగు (విజయక్రాంతి): ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్(District Collector Divakara T.S) అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 75 దరఖాస్తులు రాగా అత్యధికంగా గృహ నిర్మాణ శాఖకు 30, భూ సమస్యలు 25, ఉపాధి కల్పనకు 02, పెన్షన్ 03, ఇతర శాఖలకు సంబంధించినవి 15 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు.






