calender_icon.png 14 October, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిలాఖతుల జోరు... మతలబుల వేరు...

14-10-2025 07:31:40 PM

బాన్సువాడ రాజకీయం రసవత్తరం...

నేతల కలయికపై జోరుగా చర్చ...

ఆశ్చర్యంలో అనుయాయులు...

వర్గ పోరు  వద్దు.. కలిసి ఉండడమే ముద్దు...

కలిసిపోయిన వర్ని నేతలు, కార్యకర్తలు.. 

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ  రాజకీయం రసవత్తరంగా మారింది. నేతలు, కార్యకర్తల వ్యవహార శైలి మంచి రక్తి కట్టిస్తోంది. ఎప్పుడు విమర్శించుకుంటారో.. ఎప్పుడు కలుసుకుంటారో తెలియని సందిగ్ధత నెలకొంది. నిన్న మొన్నటి వరకు నాయకులు కార్యకర్తలు వర్గపూరు వద్దు.. కలిసుండడమే ముద్దు.. అనే నానుడి బాటన నడుచు కో వాలనుకుంటున్నారు. అందుకు వర్ని మండలం కాంగ్రెస్ పార్టీకి వేదికగా మారింది. ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏకతాటిపైకి వచ్చి కూసుండి మాట్లాడుకుందాం.. కలిసి ఉండి పని చేద్దాం.. అనే భావనకు వచ్చారు.,,  ఇది మంచి పరిణామమే. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి బాన్సువాడ సెగ్మెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, నాయకత్వం వహిస్తున్న కాసుల బాలరాజు, నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డిల అంతర్ మదనం ఏమిటో అంతుచిక్కడం లేదు.

వర్ని మండల కేంద్ర వేదికగా చేసుకుని కార్యకర్తలు కలిసిపోయినట్లే ఈ ముగ్గురు కూడా కలిసిపోతారా.. లేదా... అన్న చర్చ ప్రస్తుతం తాజాగా తెరపైకి వస్తుంది. ఈ అంశంపై అప్పుడే అధికార ప్రతిపక్ష పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. పలువురు నాయకులు అయితే బహిరంగంగా ఈ విషయంలో చర్చించుకుంటున్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి తిరుగులేని నాయకుడిగా ఎదిగిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం శాసనసభ్యుడుగా కొనసాగుతున్నారు. కొన్నేళ్లుగా ఆయన చెప్పిందే వేధంగా ఇటు నాయకులు అటు పార్టీ శ్రేణులు కష్టించి పని చేశారు పార్టీ గెలుపుకు దోహదపడ్డారు. వారి కృషికి తగ్గట్టుగా పెద్దాయన కూడా వారికి మంచి చేసి పెడుతూ వచ్చారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన పోచారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అభివృద్ధిని కాంక్షిస్తూ కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు.

అదే పార్టీలో కొనసాగుతున్న కాసుల బాలరాజుకు ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ పదవిని అంటగట్టడంతో బాన్సువాడ నియోజకవర్గంలో ఆయన కూడా నాయకుడిగా పార్టీ పటిష్టత కోసం పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి సైతం సెగ్మెంట్లో తన అనుచర గణాన్ని పెంచుకుంటూ పార్టీ కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారు. అయితే ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పోచారం, బాలరాజులు కలిసి నడుస్తుండగా, ఏనుగు రవీందర్ రెడ్డి మాత్రం వీరితో కలిసి పోకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఇటు పోచారం వర్గం, అటు రవీందర్ రెడ్డి వర్గాలు రెండుగా విడిపోయాయి. పార్టీ ఒకటే అయిన నాయకులు ఇద్దరు కావడం పార్టీ శ్రేణుల్లో వర్గ పోరుకు తెరలేపింది. ఏడాదిన్నర కాలంగా నేతలే కాకుండా పల్లె, మండల స్థాయిలో కూడా కార్యకర్తలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు రావడం, హైకోర్టు స్టే తో ఆగిపోవడం తో వీరి మధ్య మైత్రి బంధం ఏర్పడేందుకు అవకాశం లభించింది. అందుకు ఆదివారం వర్ని వేదికగా మారింది.