16-09-2025 12:18:14 AM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ టౌన్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఉన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులు, వేద పండితులతో బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో చేయాల్సిన బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్ల పై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, పద్మాక్షి, వెయ్యి స్తంభాల దేవాలయాల ప్రధానార్చకులు శంకర శాస్త్రి, గంగు ఉపేంద్ర శర్మ, పోలీస్ శాఖ నుండి హనుమకొండ ఏసిపి నరసింహారావు, వైద్య ఆరోగ్యశాఖ నుండి డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, విద్యుత్ శాఖ నుండి ఎస్ఈ మధుసూదన్, ఆర్ అండ్ బి శాఖ నుండి ఈఈ సురేష్ బాబు తమ తమ శాఖల తరపున చేసే ఏర్పాట్లను వివరించారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఈనెల 21వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయని, అదే రోజున జిల్లాలోని చారిత్రక వెయ్యి స్తంభాల దేవాలయం వద్ద ఘనంగా బతుకమ్మ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు. బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు.
ఎక్కువ సంఖ్యలో మహిళా పోలీసులను బందోబస్తుకు కేటాయించాలన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు జరగనున్న ఆలయాల వద్ద ప్రశాంతంగా సాగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అదన కలెక్టర్ వెంకట్ రెడ్డి, డిఆర్ఓ వై.వి. గణేష్, డిఆర్డిఓ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్,డాక్టర్ నారాయణ, వివిధ శాఖల అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు.