02-08-2025 02:56:38 PM
బీసీ నాయకుల నిరసన ప్రదర్శన..
మంచిర్యాల (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన బీసీ అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి(National BC Rights Fighting Committee) ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని ఐబి చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మ్యానిఫెస్టోలో పెట్టిన బీసీ అంశాలను నెరవేరుస్తానని హామీ ఇచ్చి అధికారం చేపట్టి 18 నెలలు అవుతున్న ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం అంటే కేవలం బీసీ సమాజాన్ని మభ్యపెట్టడం అవుతుందనీ, ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అమలు చేయాల్సిన అంశాలివే...
1. మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు
2. ప్రభుత్వ సివిల్ కన్స్ ట్రాక్షన్ మెంటెనెన్స్)కాంట్రాక్టులలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం.
3. చిరు వ్యాపారులకు విద్యార్థుల ఉన్నత విద్య కోసం రూ. 10 లక్షల వరకు పూచి కత్తులేని వడ్డీ లేని రుణాలు.
4. బీసీ కార్పొరేషన్లు అలాగే ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ, రూ. 10 లక్షల ఆర్థిక సహాయం
5. అన్ని జిల్లా కేంద్రాలలో రూ. 50 కోట్లతో కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు ఏర్పాటు, ఈ ఐక్యత భవనాలలోనే బీసీ సంక్షేమ శాఖ కార్యాలయాల ఏర్పాటు
తదితర అనేక అంశాలను మానిఫెస్టోలో పెట్టి బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించడం అంటే బీసీ సమాజాన్ని మభ్యపెట్టడమే అవుతుందన్నారు. ఇప్పటికైనా ఈ అంశాలను తూచా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, లేనిపక్షంలో ఈ అంశాలను బీసీ సమాజం దృష్టికి తీసుకువెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ముందట దోషిగా నిలబెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గజ్జెల్లి వెంకన్న, జిల్లా కార్యదర్శి శాఖ పురం భీమసేన్, ఏదునూరు రమేష్, కీర్తి బిక్షపతి, చంద్రగిరి చంద్రమౌళి, రంగు అశోక్, గుండా రాజమల్లు, వేముల అశోక్, ఆరెందుల రాజేశం, అంకం సతీష్, జక్కం పూర్ణచందర్, తదితరులు పాల్గొన్నారు.