calender_icon.png 7 September, 2025 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదాం..

03-09-2025 02:26:10 PM

- స్థానిక సంస్థల ఎన్నికల బరిలో బీసీ పార్టీ...

- యువత రాజకీయాల్లోకి రావాలి...

- తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ జిల్లా ఇంచార్జ్ 

మంచిర్యాల, (విజయక్రాంతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ పోటీ చేస్తుందని, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా ఇంచార్జి మహేష్ వర్మ(Telangana Political BC JAC District Incharge Mahesh Varma) అన్నారు. బుధ వారం జిల్లా కేంద్రంలోని బీసీ జేఏసీ కార్యాలయంలో తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల మిషయంపై నిర్వహించిన కీలక సమావేశంలో ఆయన మాట్లాడారు. తీన్మార్ మల్లన్న సారధ్యంలో బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. ఎంపిటిసి, జెడ్పిటిసి, సర్పంచ్ లుగా పోటీ చేయాలని అనుకుంటున్న బీసీ, బహుజనుల అభ్యర్థులకు తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 

మూడు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయి...

కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బీసీలను, బహుజనులను మోసం చేస్తున్నాయని తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా ఇంచార్జి మహేష్ వర్మ అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు 42 శాతం అన్నిరంగాల్లో అమలుచేస్తామని,  తొమ్మిదవ షెడ్యూల్ లో పొందు పరుస్తామని హామీ ఇచ్చి కేవలం రాజకీయ లబ్ది కొరకే ఎన్నికల్లో వాటా ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీలు కేవలం రాజకీయ లబ్ది పొందేందుకు మాత్రమే బీసీ వాదాన్ని వినిపిస్తున్నాయి తప్ప, బీసీల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదనే విషయాన్ని ఈ బీసీ సమాజం గమనిస్తుందని అన్నారు. 

యువత రాజకీయాల్లోకి రావాలి...

యువత రాజకీయాల్లోకి రావాలని తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా ఇంచార్జి మహేష్ వర్మ పిలుపునిచ్చారు. కిరాయి పార్టీల జెండాలు మోసింది చాలని, మన జెండాను మాత్రమే మనం మోసుకొని, మన ఓట్లతోనే మన రాజ్యాధికారాన్ని మనం సాధించుకుందామని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదామని, ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన ఉన్న అభ్యర్థులు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ కార్యాలయంలో మీ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ జిల్లా నాయకులు పాకాల దినకర్, దాస్యపు దీపక్, ఎల్తపు రాజశేఖర్, పడాల శివతేజ, సీపతి సాయికిరణ్, మహమ్మద్ లతీఫ్, కొత్తూరి సంతోష్, కుంట రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.