పత్తి కూలీలపై తేనెటీగల దాడి
20 మందికి గాయాలు
కోనరావుపేట అక్టోబర్ 24 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోనరావుపేట మండలంలోని వెంకట్రావు పేట గ్రామానికి చెందిన దాదాపు 20 మంది వ్యవసాయ కూలీల పై తేనెటీగలు ఒకేసారి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. వెంకట్రావు పేట గ్రామానికి చెందిన దాదాపు 20 మంది కూలీలు శుక్రవారం ఉదయం పత్తి తీయడానికి వెంకట్రావుపేట నుండి కనగర్తి గ్రామానికి ఉపాధి నిమిత్తం వెళ్ళారు. రోజులాగే ప్రత్తి ఎరుతుండగా, సమీపంలోని చెట్టుకు వున్నా తేనెపట్టు నుండి తేనె టీగల గుంపుగా వచ్చి వారిపై దాడి చేసింది.
తేనెటీగల దాడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూలీలు భయంతో పరుగులు తీసారు. తేనెటీగల దాడిలో పలువురు కూలీలు స్పృహ కోల్పోగా మరికొందరు తేనెటీగల కుట్టడంతో నొప్పితో కూలీల అరుపులు, రోదనలు విన్న స్థానికులు, చుట్టుపక్కల పొలాల్లో ఉన్న రైతులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి సహాయంతో గాయపడిన కూలీలను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఒకేసారి ఇంతమంది కూలీలపై తేనెటీగలు దాడి చేయడం స్థానికంగా ఆందోళన కలిగించింది. సకాలంలో స్థానికులు స్పందించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. కూలీలను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.తేనెటీగల దాడిలో గాయపడిన వారిని మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య పరామర్శించారు.




