ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
ఎమ్మెల్యే కోవ లక్ష్మీ
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 13 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ సూచించారు. సోమవారం ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ ఎమ్మెల్యేను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా వైద్యులు, సిబ్బంది సేవాభావంతో విధులు నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా పేద, నిరుపేద ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అత్యవసర వైద్య సేవలు, ప్రసూతి సేవలు, సాధారణ వైద్య సేవలు సకాలంలో అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
ఆసుపత్రికి వచ్చే రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారికి అవసరమైన చికిత్సను ఆలస్యం లేకుండా అందించాలని తెలిపారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, మందుల లభ్యత, వైద్య సదుపాయాల మెరుగుదలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.నూతన సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






