l మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
l పోస్ట్కార్డు ఉద్యమానికి మద్దతు
ఖమ్మం, మే 1 (విజయక్రాంతి): విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాల్సిందేనని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఖమ్మం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారతరత్న ఇవ్వాలని చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమానికి మద్దతు తెలిపిన ఆయన, రఘురాంరెడ్డి తో కలిసి పోస్టుకార్డులపై సంతకాలు చేశారు. అనంతరం పార్టీ నేతలు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, కేతినేని హరీశ్తో కలిసి తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. రాజకీయాల్లో అనేక సంస్కరణలు తెచ్చింది మొదట దివంగత ప్రధాని ఇందిరా గాంధీ, తర్వాత ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. ఫలితంగానే కొత్తతరం రాజకీయాల్లో రాణించగలుగుతున్నారు అని చెప్పారు. మీ అంద రూ సహకారం అందించి రఘురాంరెడ్డి ని గెలిపించాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, విద్యా, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్బాబు, సీనియర్ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, నాయకులు ఎండీ ముస్తఫా, కొప్పుల చంద్రశేఖర్రావు, ఉత్తేజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.