డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క
- డ్రగ్స్ కట్టడికి కఠిన నిర్ణయాలు
- తెలంగాణలో పుట్టిపెరగటం ఒక భరోసా
- సమాజంలో పరివర్తన రాకుంటే.. ఎన్ని చట్టాలు చేసిన ప్రయాజనం శూన్యం
హైదరాబాద్: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం(International Day Against Drug Abuse and Illicit Trafficking) సందర్బంగా శిల్పకళా వేదికగా ఈగల్ ఫోర్స్ యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినీ నటులు రామ్ పోతినేని(Ram Pothineni), మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హాజరయ్యారు. ఈగల్ ఫోర్స్(Telangana Eagle Force) సంపూర్ణంగా పనిచేసేలా అన్ని వసతులు కల్పించామని భట్టి విక్రమార్క(Bhatti Vikramarka ) పేర్కొన్నారు. జీవితం చాలా విలువైనది.. డ్రగ్స్ బారిన పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఉపముఖ్యమంత్రి సూచించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తారని వివరించారు. తల్లిదండ్రుల్లాగే ఈ ప్రభుత్వం కూడా మిమ్మల్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తోందని తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం పోలీసులు ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. తమ జీవితాలను రిస్క్ లో పెట్టి డ్రగ్స్ ముఠాలను పట్టుకుంటున్నారని కొనియాడారు. డ్రగ్స్ కేసులో దొరికితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. డ్రగ్స్ కట్టడికి ఎలాంటి కఠిన నిర్ణయమైనా తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో పుట్టిపెరగటం ఒక భరోసాగా భావించే పరిస్థితులు కల్పిస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సమాజంలో పరివర్తన రాకుంటే.. ఎన్ని చట్టాలు చేసిన ప్రయోజనం శూన్యం అన్నారు. సినిమా నటులు ఇచ్చే సందేశం సమాజంలోకి బలంగా వెళ్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు.






