calender_icon.png 26 January, 2026 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు చెంతకే ‘భూధార్’

26-01-2026 12:16:16 AM

  1. క్షేత్రస్థాయిలో ఆధునిక ‘రోవర్స్’తో కొలతలు
  2. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి

రఘనాథపాలెం /ఖమ్మం: జనవరి 25(విజయక్రాంతి)- భూములకు సంబంధించి ప్రతి అంగుళాన్ని డిజిటలైజ్ చేసి, యజమానులకు శాశ్వత యాజమాన్య భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ’ధరణి’ ద్వారా సృష్టించిన చిక్కుముడులను విప్పు తూ.. రైతులకు చుట్టంలా ఉండేలా ’భూభారతి’ చట్టాన్ని అమలులోకి తెచ్చామని ఆయన వెల్లడించారు. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ (ఐడీఓసీ)లో శిక్షణ పూర్తి చేసుకున్న లైసెనస్డ్ సర్వేయర్లకు ఆయన ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

అత్యాధునిక సాంకేతికత

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘గతంలోని టేపులు, గొలుసుల పద్ధతులకు స్వస్తి పలికి, సెంటీమీటర్ల తేడాతో ఖచ్చితత్వం వచ్చేలా ’రోవర్స్’ సాంకేతికతను వాడుతున్నాం. ఇప్పటికే 600 రోవర్లను కొనుగోలు చేసి జిల్లాలకు పంపిణీ చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పొందిన 5,500 మంది లైసెనస్డ్ సర్వేయర్లను మండలాల వారీగా భూ విస్తీర్ణం ప్రాతిపదికన కేటాయించాం‘ అని వివరించారు. ఖమ్మం జిల్లాలో రెండో విడతలో అర్హత సాధించిన 47 మందికి నియామక పత్రాలు అందజేశామని, వీరంతా పారదర్శకతతో పనిచేయాలని సూచించారు.

ధరణి అక్రమాలపై ఉక్కుపాదం

ధరణిలో జరిగిన లోపాలపై ఇప్పటికే సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తి చేశామని, ఆ నివేదికలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి తెలిపారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 31 జిల్లాల్లోనూ ఆడిట్ నిర్వహిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని, ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

బాధితులకు ఆర్థిక సాయం

హైదరాబాద్ నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బాధితులకు అండగా ఉండాలని ఆదేశించారన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు.