calender_icon.png 24 June, 2025 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే భువనగిరికి మహర్దశ

24-06-2025 12:03:36 AM

హెచ్‌ఎండిఏ నిధులతో  అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

 మునిసిపాలిటీలో రూ, 13 కోట్ల 60 లక్షలు. మండలంలో రూ,9 కోట్ల 50 లక్షలు 

యాదాద్రి భువనగిరి జూన్ 23 ( విజయక్రాంతి ) : కాంగ్రెస్ ప్రభుత్వంలో భువనగిరి నియోజకవర్గానికి మార్దశ వచ్చిందని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గత 10 ఏళ్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. హెచ్‌ఎండిఏ నిధుల నుండి భువనగిరి మున్సిపాలిటీకి మంజూరైన రూ, 13 కోట్ల 60 లక్షలు.

భువనగిరి మండలానికి విడుదలైన రూ, 9 కోట్ల 50 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు సోమవారం నాడు భువనగిరి పట్టణ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలోని ఆనాటి ప్రభుత్వం తెలంగాణను దోచుకుని లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆ కుటుంబ అవినీతి అక్రమాలకు నేడు ఫలితం అనుభవిస్తారని ఎమ్మెల్యే అన్నారు.

ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ ఇందిరమ్మ పాలన 18 నెలల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రైతు బంధు, రేషన్ కార్డులు, ఉచిత బస్సు సౌకర్యం, 250 యూనిట్ల ఉచిత కరెంటు, మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు.

గత పది ఏళ్లలో హెచ్‌ఎండిఏ నిధులు 75 కోట్లు వస్తే ఒక్క సంవత్సరంలోనే తమ ప్రభుత్వంలో 56 కోట్ల రూపాయలు తీసుకొచ్చామన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి ఇండ్లు లేని పేదవారికి 3500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామన్నారు. దశలవారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనేది మా లక్ష్మన్నారు. ఇందిరమ్మ ఇండ్లు అందరికీ ఇచ్చిన నాడే తాము ఓట్లు అడిగి మద్దతు కోరుతామన్నారు.

కెసిఆర్ మాదిరిగా  చేయలేనిది కూడా చేస్తామని చెప్పి మోసం చేసే ప్రభుత్వం మాది కాదు. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం ఆనాడు ఇందిరా గాంధీ ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించిందో ఆ పద్ధతిలో  చేయగలిగేది చెప్పి మాట నిలబెట్టుకుంటామన్నారు. తమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు అన్ని రంగాలలో భువనగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని కుంభం అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తీ, పిసిసి డెలిగేట్ మాజీ నెంబర్ తంగెళ్లపల్లి రవికుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూరపాటి వెంకటేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాబురావు, మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, కృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు