calender_icon.png 11 November, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిచ్కుందను ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తా

11-11-2025 10:34:07 PM

ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..

బిచ్కుంద (విజయక్రాంతి): బిచ్కుందను ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. మంగళవారం బిచ్కుందలో పార్టీలకతీతంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బిచ్కుంద సెంట్రల్ లైటింగ్ పనుల పురోగతిపై మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ బిచ్కుంద సెంట్రల్ లైటింగ్ పనులు ఖచ్చితంగా పూర్తి చేస్తామని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలోని మొట్టమొదటి మున్సిపాలిటీ అయిన బిచ్కుందను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 

అయితే సెంట్రల్ లైటింగ్ పనుల జాప్యానికి గల కారణాలు ఈ సందర్బంగా ఎమ్మెల్యే  వివరించారు. ఎలక్షన్స్ ముందు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే  కేవలం తన రాజకీయ లబ్ది కోసం కాంట్రాక్టు అవ్వకుండానే ఆగ మేఘాల మీద సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసాడని చెప్పారు. బిచ్కుంద ప్రజలను మభ్యపెడుతూ రాజకీయ పబ్బం గడుపుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పనులు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్ ను తొలగించి కొత్త కాంట్రాక్టర్ కు పనులు అప్పగించడం జరిగిందని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ఏడు ఎనిమిది నెలల సమయం పట్టిందని తెలిపారు. సెంట్రల్ లైటింగ్ పనులు అన్ని శాఖల సమన్వయంతో చేయాల్సి ఉంటుందని అన్నారు. 

అదే సమయంలో జన జీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయాల్సి ఉంటుంది కాబట్టి పనులలో కొంత ఆలస్యం జరుగుతుందని వివరించారు. బిచ్కుంద ప్రజలు సహకరిస్తే వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధి కోసం చిత్త శుద్ధితో పని చేస్తున్నామని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 15 కోట్లు మంజూరు అయ్యాయని అన్నారు, భవిష్యత్ లో మరిన్ని నిధులు తీసుకొస్తామని చెప్పారు. శాశ్వత త్రాగునీటి వ్యవస్థ ఏర్పాటు చేయడానికి నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ కు సంబంధించి కూడా టెండర్స్ ప్రక్రియ పూర్తి అయినట్లు తెలిపారు. అభివృద్ధి విషయంలో ఎటువంటి రాజీ పడబోమని,  పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. రాజకీయ నిరుద్యోగులు, అవకాశవాదులు చేస్తున్న  విమర్శలు పట్టించుకోవద్దని  సూచించారు.