07-12-2025 12:00:00 AM
కాంగ్రెస్ పాలనకు నిరసనగా నేడు ధర్నా చౌక్ వద్ద మహాధర్నా
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): రెండేళ్లుగా అమలుకాని హామీల కోసం ప్రజావంచన కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ బీజేపీ మహాధర్నాను ఆదివారం చేపట్టనుంది. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ కాంగ్రెస్ సర్కార్పై పోరుబాట చేస్తున్నట్లుగా తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మహాధర్నా చేయనున్నారు.
ఈ ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, బీజేఎల్సీ నేత ఏవీఎన్రెడ్డితోపాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు, పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో పాల్గొననున్నారు.‘
అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా రైతు భరోసా లేదు. రూ.4వేల పింఛన్ జాడ లేదు. విద్యార్థులకు భరోసా లేదు. “మాయ మాటల” కాంగ్రెస్ పాలనను ఎండగట్టేందుకు, ప్రజాసమస్యలపై గళమెత్తేందుకు సిద్ధం కండి’ అంటూ బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు.