రాష్ట్రంలో బీజేపీదే భవిష్యత్తు
కార్యకర్తల సమీక్షలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి
హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): తెలంగాణలో బీజేపీకి అద్భుతమైన భవిష్యత్తు ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి స్పష్టంచేశారు. పార్టీ అభివృద్ధి కోసం నాయకులు, కార్యకర్తలు అనే తేడాలేకుండా అందరూ కష్టపడి పనిచేయాలని కోరారు. సోమవారం బేగంపేట హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు, పోలింగ్ బూత్ ఇన్చార్జులు, బూత్ కమిటీ సభ్యులతో ఆయన సమీక్షించారు. లోక్సభ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులంతా ఎంతో కష్టపడి పనిచేశారని కితాబిచ్చారు.
తెలంగాణలో బీజేపీపై విశ్వాసం పెరుగుతున్నందున పార్టీ విస్తరణ కోసం మరింతగా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా బూత్ల వారీగా బీజేపీకి వచ్చిన ఓట్లు, ఆయా వర్గాల మద్దతు, పోలింగ్ సరళిపై కార్యకర్తలతో చర్చించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాల సందర్భంగా బూత్ కమిటీ ఏజెంట్లు వ్యవహరించాల్సిన తీరుపై సూచనలు చేశారు.






