జాతీయ జెండాకు అవమానం జరిగిందని బీజేపీ నేతల ఫిర్యాదు
ఆదిభట్ల, ఆగస్టు 17 ( విజయ క్రాంతి ): ఆదిభట్ల సర్కిల్ తొర్రూర్ డివిజన్ కమ్మగూడలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఆగస్టు 15న జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. బీజేపీ పార్టీ 53, 56 డివిజన్ల అధ్యక్షులు ఎలిమినేటి నరసింహారెడ్డి,బీజేపీ నాయకులు కొంత రాంరెడ్డి బచ్చిగల రమేష్ కొత్త ఈ మేరకు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ జాతీయ త్రివర్ణ పతాకానికి బదులుగా ఆకుపచ్చ జెండాతో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారని ఆరోపించారు.పాఠశాలలో రోజువారీ కార్యక్రమాల్లో వందేమాతరం బోధించడం లేదని పేర్కొన్నారు.ఈ ఘటనపై అధికారికంగా విచారణ జరపాలని అధికారులను కోరారు.పాఠశాలలో జాతీయ జెండా వినియోగంపై ఫ్లాగ్ కోడ్ నిబంధనలు పాటిస్తున్నారో పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల్లో జాతీయ భావాన్ని పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు గుండ కృష్ణ, నందగిరి సురేష్, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






