మోదీ బర్త్డే ఫ్లెక్సీ చింపివేత.. పోలీసులకు బిజెపి నాయకుల ఫిర్యాదు
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా వేములవాడ పట్టణ బిజెపి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. కోరుట్ల బస్స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని బ్లేడ్తో ఉద్దేశపూర్వకంగా చింపివేయడంతో బిజెపి కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమైంది.ఈ ఘటనపై పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర మంత్రి బండి సంజయ్ అడుగుజాడల్లో శాంతియుతంగా పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తున్న తరుణంలో చేతకాని వెధవలు రాజకీయంగా ఎదుర్కోలేక చిల్లర పనులకు పాల్పడుతున్నారనీ మీ ఆగడాలను ప్రజలు గ్రహిస్తున్నారని..మళ్లీ ఇలాంటి సంఘటనలు జరిగితే తీవ్రంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు.




