నెల గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయలేని ప్రభుత్వం
ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల నిరసన
తాళం వేసిన కార్యాలయానికి వినతిపత్రం అతికించిన వైనం
జిన్నారం/అమీన్ పూర్: జిన్నారం మండలంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై భారతీయ జనతా పార్టీ నాయకులు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. రైతులు నెల రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ఎదురుచూస్తున్నప్పటికీ ప్రభుత్వం సరైన సమయంలో కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ... రైతులు ఎన్నో కష్టాలు పడి పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
కానీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో వడ్లు కొనుగోలు కేంద్రాల వద్ద, రైతులు ఆరబోసిన ప్రదేశాల్లోనే పేరుకుపోయి ఉన్నాయని ఆరోపించారు. వర్షాలు వస్తే రైతులు తీవ్ర నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు రోజులు గడుస్తున్నా కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో రైతుల ఆవేదనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అయితే కార్యాలయ సమయం ఉదయం 11 గంటలు దాటినా ఎమ్మార్వోతో పాటు సిబ్బంది అందుబాటులో లేకపోవడం బాధాకరమన్నారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ నాయకులు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి, తాళం వేసి ఉన్న కార్యాలయ ద్వారానికి తమ వినతిపత్రాన్ని అతికించారు.
రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి పెండింగ్లో ఉన్న ధాన్యం కొనుగోళ్లను అత్యవసరంగా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులతో కలిసి మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మున్సిపల్ వైస్ చైర్మన్ వంగేటి ప్రతాప్ రెడ్డి, కురుపల్లి నర్సింగరావు, జిన్నారం మండల బీజేపీ అధ్యక్షులు కొత్తకాపు జగన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వంగేటి రాజిరెడ్డి, కౌన్సిలర్లు కుమార్ స్వప్న, రాజేందర్ రెడ్డి, వెంకటేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు పూడూరి సుధాకర్, నాయకులు శ్రీనివాస్, యాదవ్, దుబ్బ శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు.






