22 May, 2026 | 7:31 PM

క్రీడల ద్వారా మానసిక ప్రశాంతత మనోధైర్యం

22-05-2026 06:51 PM

ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్

గరిడేపల్లి,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించే క్రీడల ద్వారా యువత గెలుపు ఓటమిల ద్వారా జీవిత సత్యాలను మనోధైర్యాన్ని మానసిక ప్రశాంతతను పొందవచ్చునని ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ అన్నారు. మండలంలోని కల్మలచెరువు గ్రామంలో స్థానిక యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రికెట్ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే క్రీడా పోటీల ద్వారా నైపుణ్యం గల క్రీడాకారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు.

నైపుణ్యం గల క్రీడాకారులు ఆటలలో పాల్గొని తమ సత్తాను చాటుకుని ఉత్తమ ప్రదర్శనను అందించాలని ఆయన కోరారు.టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులందరూ గెలుపు, ఓటములను సమానంగా తీసుకుని క్రీడా స్ఫూర్తిని చాటాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో వేసవి సెలవల్లో ఇటువంటి క్రీడలను నిర్వహించే యువతను అందరూ ప్రోత్సహించి సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. క్రీడాకారులు ఈ టోర్నమెంటులో ఉత్తమ ప్రదర్శనలు ప్రదర్శించి విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో కల్మలచెరువు గ్రామ యువజన సంఘం,  క్రీడా పోటీల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.