దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు

28-04-2024 02:02:57 AM

మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

చొప్పదండి, ఏప్రిల్ 27 (విజయక్రాంతి) : దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తూ ఓట్లడుగుతున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. గంగాధర మండలం మధురానగర్ చౌరాస్తాలో శనివా రం నిర్వహించిన రోడ్‌షోకు ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, అన్ని హామీలు నెరవేరుస్తుందని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు.

ఈ పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం దేశంలో ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరాస్తాలో చర్చించేందుకు తాను సిద్ధమన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్‌రెడ్డి, జిల్లా మహిళాధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న తదితరులు పాల్గొన్నారు.