కొత్త ఆటోల బ్లాక్ మార్కెటింగ్ను తక్షణమే అరికట్టాలి
మహాత్మాగాంధీ తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్
ముషీరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): కొత్త ఆటో షోరూంల డీలర్లు, ప్రైవేట్ ఫైనాన్షియర్లతో కుమ్మకై ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తున్న కొత్త ఆటోల బ్లాక్ మార్కెటింగ్ ను తక్షణమే అరికట్టాలని మహాత్మాగాంధీ తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కొత్త ఆటోల బ్లాక్ మార్కెటింగ్ వ్యాపారం నగరంలో నిరంతరంగా కొనసాగుతున్నదని, ఈ అక్రమ వ్యాపారాన్ని అరికట్టి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరారు. భవిష్యత్తులో ఆటో బ్లాక్ మార్కెటింగ్ ను నిరోధించడానికి ఫైనాన్షియర్లు షోరూం రేటు యొక్క అసలు ధరను మించకుండా ఆటోలకు ఫైనాన్స్ చేసేవిధంగా పరిమితం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై నగర పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.






