అనుమానాస్పద పరిస్థితుల్లో బాలుడు మృతి
సూర్యాపేట: 13 ఏళ్ల బాలుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్లో ఆదివారం చోటు చేసుకుంది. బాలుడి తల్లిదండ్రుల నుండి పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వివారాల్లోకి వెళితే... విజయ అనే మహిళకు కోటేశ్వరరావు అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి కార్తీక్ ఉన్నారు. దంపతుల మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలతో గత పదేళ్లుగా విడివిడిగా నివసిస్తున్నారు. విజయ తన కుమార్తెను కుమారుడితో కలిసి తల్లిగారి ఇంటి వద్ద ఉంటూ కూలి పనులు చేసుకొంటు జీవనం సాగిస్తుంది.
రెండేళ్ల క్రితం భర్త కోటేశ్వరరావు తిరిగి వచ్చి, కూరగాయల వ్యాపారం చేసుకుంటూ అదే ఇంట్లో నివాసమంటున్నాడు. ఇటీవల కోటేశ్వరరావు ఒక బాలుడిని తీసుకొచ్చి ఈ బాబు తన కొడుకు అని తనకు మరో మహిళతో వివాహమైందని, ఆమెకు ఇద్దురు పిల్లలు పుట్టారని, తన స్వస్థలమైన ఇబ్రహీంపట్నానికి మారాలని విజయపై ఒత్తిడి తీసుకురాగా, ఆమె అందుకు నిరాకరించడంతో గత కొద్ది రోజులుగా ఉద్రిక్తతలు పెరిగాయని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలిడు కార్తీక్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. శనివారం తల్లి కూలి పని కోసం, తండ్రి కూరగాయల వ్యాపారం చేసేందుకు వెళ్లాడు.
ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో కార్తీక్ ఉరివేసుకుని మరణించాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తండ్రి దూలానికి వేలాడుతున్న కుమారుడిని కిందికి దించి భార్య విజయకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుడి మెడపై బిగుసుకున్న ఆనవాళ్లతో అతను మంచంపై పడి ఉన్నట్లు కనిపించాడు. అయితే, ఆ బాలుడి తల్లి విజయ, తన భర్తే తమ కుమారుడిని హత్య చేసి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.






