28-06-2025 12:15:41 PM
హైదరాబాద్: అన్నపూర్ణ క్యాంటీన్ పేరును ఇందిరా క్యాంటీన్గా మార్చాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ(GHMC Standing Committee) తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ, హైదరాబాద్లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. ఆందోళనలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani Srinivas Yadav) పాల్గొన్నారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు.
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) ఆధ్వర్యంలో పేదలకు కడుపునిండా అన్నం పెట్టాలనే ఉద్దేశ్యంతో అన్నపూర్ణ క్యాంటీన్ పథకం ఏర్పాటు చేశామని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. అన్నపూర్ణ అనగానే అమ్మవారు గుర్తు వస్తారు. అలాంటి పేరును మార్చడం మంచి పద్దతి కాదని సూచించారు. ఒకవేళ పేరు మార్చాలనే ఉదేశ్యం ఉంటే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం(GHMC Council Meeting) ఏర్పాటు చేసి మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అన్నపూర్ణ క్యాంటీన్ల(Annapurna Canteens) పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మాజీ మంత్రి తలసాని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.