పార్టీ బలోపేతంలో బీఎల్ఏల పాత్ర కీలకం
బీఆర్ఎస్ బీఎల్ఏలకు ఐడీ కార్డులు అందజేసిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ
మెదక్, జూన్ 29 (విజయక్రాంతి) : బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో బీఎల్ఏల పాత్ర ఎంతో కీలకమని, ఓటరు జాబితాపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదు అయ్యేలా బాధ్యతాయుతం గా పనిచేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మాదేవేందర్ రెడ్డి బిఎల్ఏలకు సూచించారు.
సోమవారం మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మెదక్ పట్టణానికి చెందిన బీఎల్ఏలకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటరు జాబితా అత్యంత కీలకమైందని, దానిని ఎప్పటికప్పుడు పరిశీలించి లోపాలు లేకుండా చూడాల్సి న బాధ్యత బీఎల్ఏలపై ఉందన్నారు.
ఎన్నికల సంఘం చేపట్టే ప్రతి కార్యక్రమంపై పూర్తి అవగాహనతో పనిచేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా, అనర్హుల పేర్లు తొలగించేలా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పార్టీ దృష్టికి తీసుకెళ్లాలని, పార్టీ కార్యక్రమాలను ఇంటింటికీ చేరవేయడంలో సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మెదక్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అకిరెడ్డి కృష్ణారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు,కౌన్సిలర్లు జుబెర్ అహ్మద్,బట్టి ఉదయ్, మ్యాదరి. దీపక్ కుమార్,మాజీ కౌన్సిలర్ లు మాయ. మల్లేశం,బీమరి కిషోర్, పార్టీ బిఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు.






