29-05-2025 01:40:22 PM
హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం హాస్యాస్పదమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kalvakuntla kavitha) అన్నారు. మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో పార్టీ నేతలపై కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు అన్యాయం చేసేలా గోదావరి-బనకచర్ల చేపడుతున్నారని కవిత ఆరోపించారు. ఎన్డీఏలో ఉన్నందున కేంద్రం ఏమీ అనదని ముందుకెళ్తున్నారని ఆమె విమర్శించారు. రేవంత్ రెడ్డి తో భేటీ తర్వాతే చంద్రబాబు గోదావరి-బనకచర్ల చేపట్టారని తెలిపారు. అందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) లో నాకు నీతులు చెబుతున్న నాయకులు స్పందించాలని కవిత డిమాండ్ చేశారు. గోదావరి- బనకచర్ల అంశం వచ్చినప్పుడు పెద్దఎత్తున కార్యాచరణ చేపట్టాలన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే కూడా స్పందించకపోతే ఎలా?, నాకు నీతులు చెబుతూ కోవర్టులు ఉన్నారని అంటే ఏలా?, నా మీద పడి ఏడిస్తే ఏలా? అని కవిత ప్రశ్నించారు. నేను అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్ బ్యాక్ లీక్ అయిందన్న కవిత కట్టడి చేయమంటే పెయిడ్ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడితే అది మర్యాదేనా? అని ప్రశ్నించారు. లిక్కర్ కేసు వచ్చినప్పుడు రాజీనామా చేస్తా అంటే కేసీఆర్ వద్దని వారించారని కవిత వెల్లడించారు. ఎంపీగా పార్టీలోనే కుట్ర పూరితంగా ఓడించారని కవిత ఆరోపించారు. అదే జిల్లాలో ప్రోటోకాల్ ఉండాలని కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. నేను పదవుల కోసం ఏనాడూ పాకులాడ లేదన్న కవిత కడుపులో బిడ్డను పెట్టుకుని ఉద్యమంలో సైనికురాలిలా పనిచేశానని గుర్తుచేశారు. నన్ను విమర్శిస్తున్న నేతలు కేసీఆర్ నీడన తప్ప.. చేసిన కార్యక్రమాలు ఏమున్నాయన్నారు.
కడుపులో బిడ్డను పెట్టుకుని లీకు వీరులను ఎండగట్టమంటే గ్రీకు వీరుల్లా నాపై ప్రతాపం చూపుతున్నారని కవిత ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీపై మాట్లాడాలి.. కానీ నాపై దాడి చేస్తే ఎలా? అన్నారు. గంప గుత్తగా బీఆర్ఎస్ ను బీజేపీకి అప్పగించాలన్న ప్రయత్నం జరుగుతోందని కవిత సంచలన ఆరోపణలు చేశారు. జైలులో ఉన్నప్పుడే ప్రతిపాదన వస్తే నేను వ్యతిరేకించానని తెలిపారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండాలన్నదే నా అభిమతం అన్నారు. నన్ను పార్టీ నుంచి బయటకు ఎవరు పంపుతారు.. అంత సీన్ లేదని కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్ తో నేను మాట్లాడాను అన్నది శుద్ధ అబద్ధం అని ఆమె కొట్టిపాడేశారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ మాత్రమే నాకు నాయకుడు అన్న కవిత కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఇవ్వాల్సిన ప్రొటోకాల్, గౌరవం ఉంటుందన్నారు.
నాపై దుష్ప్రచారం చేస్తున్నా పార్టీ స్పందించలేదని కవిత ఫైర్ అయ్యారు. దేశం వెలుపల ఐటీ సెల్ లు పెట్టి నాపై పోరాడుతామంటే ఎలా?, దొంగల్ని పట్టుకోమంటే చేతగాక నాపై ప్రతాపం చూపితే ఎలా?, కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ..కేవలం ఎక్స్ లో పెట్టి వదిలేస్తే ఎలా? అని ప్రశ్నించారు. పార్టీ నాది.. ప్రతి ఒక్కరూ పోరాడితేనే ఫలితం ఉంటుందని కవిత సూచించారు. కేసీఆర్ ఎలాంటి తప్పు చేయలేదని, నన్ను, కేసీఆర్ ను విడదీసే కుట్ర చేస్తున్నారని కవిత ఆరోపించారు. నా తండ్రిని, నా కుటుంబాన్ని వదిలి నేను ఎందుకు వెళ్తాను?, నన్ను నా కుటుంబానికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. నన్ను దూరం చేస్తే ఎవరికి లాభం జరుగుతుందో ఆలోచించుకోవాలని చెప్పారు.
దామోదర్ రావు, గండ్ర మోహన్ రావును ఎవరు పంపారో నాకు తెలియదని కవిత అన్నారు. దామోదర్ రావు, గండ్ర మోహన్ రావు ఎవరికి దగ్గరో తెలుసు కదా అన్నారు. కొత్త పార్టీ ఎందుకు? ఉన్న పార్టీని బాగా చూసుకుంటే చాలు అన్న ఆమె ఎంతో మంది నేతలు వస్తుంటారు.. నాకు కేసీఆర్ మాత్రమే నాయకుడు, హీరో అని పేర్కొన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. అందులో ఎలాంటి అనుమానం లేదని కవిత తెలిపారు. లీకు వీరుడా.. లీకు వీరులా.. తెలియాలాల్సి ఉందని వెల్లడించారు. వెన్నుపోటు పొడవడం నా లక్షణం కాదు.. నేరుగానే పోరాడతానని కవిత స్పష్టం చేశారు. లేఖలో నేను చేసిన సూచనల్లో ఒక్కటైనా తప్పుగా ఉందా?, కడుపులో విషం పెట్టుకుని బయటకు నవ్వుతూ ఉండనని తేల్చిచెప్పారు. కేసీఆర్ ను నడిపించేంత పెద్దవాళ్లు అయ్యారా? అంటూ మండిపడిన కవిత నా తండ్రికి వందల లేఖలు రాశాను.. తప్పేమిటి? అని ప్రశ్నించారు.