గుర్తు తెలియని మహిళ దారుణ హత్య
- బాసర రహదారిపై పడేసిన మృతదేహం
- నిజామాబాద్ జిల్లా ఫకీరాబాద్ గ్రామ శివారులో ఘటన
నిజామాబాద్, నవంబర్1(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మిట్టాపూర్ వద్ద గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను హత్యచేసిన దుండగులు మృతదేహాన్ని బాసరకు వెళ్లే రోడ్డు పక్కన వివస్త్రగా పడేశారు. ఈ సంఘటన నిజామాబాద్ జిలాలో కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.
తల, ఎడమ చేతి వేళ్లు, కుడిచేయి మణికట్టు వరకు లేకుండా మృతదేహం ఉన్నది. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
మరో ప్రాంతంలో చంపి అక్కడ పడేశారని భావిస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ సాయి చైతన్య లభ్యమైన ఆధారాల మేరకు హంతకులను పట్టుకునేందుకు పోలీసు బృందాలను రంగంలోకి దిం పారు. డాగ్ స్క్వాడ్తో నిందితుల అచూకీకై ప్రయత్నాలు ప్రారంభించారు.




