బడ్జెట్ పాఠశాలలను ఆదుకోవాలి
ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, రాష్ట్ర కోర్ కమిటి సభ్యుడు మంగ నాగయ్య
వికారాబాద్, మే 23 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 9 వేల ప్రైవేటు బడ్జెట్ పాఠశాలలను ప్రోత్సహించి, కాపాడాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, రాష్ట్ర కోర్ కమిటి సభ్యుడు మంగ నాగయ్యలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ వివేకవాణి విద్యాలయంలో ట్రస్మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 11 వేల ప్రైవేటు పాఠశాలలు ఉండగా అందులో 9 వేల బడ్జెట్ పాఠశాలలు ఉన్నట్లు తెలిపారు.
తాము ఉపాధి పొందుతూ లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ.. బడ్జెట్ పాఠశాలల ఆర్థిక పరిస్థితి ఏమాత్రం మారలేదన్నారు. కార్పొరేట్ పాఠశాలల కారణంగా తమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు డీసీఈబీ ఫీజు ఒకే విధంగా ఉండాలని కోరారు. పాఠశాల యాజమానులకు, పాఠశాల సిబ్బందికి రూ. 10 లక్షల ఉచిత బీమా సౌకర్యం, విద్యుత్ బిల్లులో రాయితీ, రుణసౌకర్యం కల్పించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్ ఎన్ రెడ్డి, కోశాధికారి శ్రీకాంత్ రెడ్డి, వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.






