బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి
ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి
వరంగల్ తూర్పు, మే 23: నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డిని గెలిపించాలని కామారెడ్డి ఎమ్మెల్యే, పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావుతో కలిసి నగరంలోని ఎల్ఐసీ ప్రధాన కార్యాలయంతో పాటు పలు విద్యాసంస్థల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యావత్ దేశ ప్రజలు ప్రధాని మోదీ పరిపాలనను కోరుకుంటున్నారని, పట్టభద్రులు కూడా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి మోదీకి మద్దతు పలకాలన్నారు. ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవు తుందన్నారు. ప్రచారంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.






