03-06-2025 10:42:18 AM
బూర్గంపాడు,(విజయక్రాంతి): హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి విద్యా పరిశోధన శిక్షణ సంస్థ(State Level Educational Research Training Institute) ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధిలో వివిధ అభ్యసన పద్ధతులపై (బెస్ట్ ప్రాక్టీస్) నిర్వహించిన ఉత్తమ ప్రదర్శనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొరంపల్లి బంజర్ ఉపాధ్యాయుడు తేజావత్ మోహన్ ఎంపిక అయ్యారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి నూతన అభ్యసన ప్రక్రియ ప్రదర్శనలకు సంబంధించి ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై డా.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం హైదరాబాద్ శిక్షణ కేంద్రం రాష్ట్రంలోని మండల విద్యాశాఖ అధికారుల శిక్షణ తరగతులందు ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బూర్గంపాడు మండలం నుండి ఎన్నికైన ఉపాధ్యాయుడు తేజావత్ మోహన్ ను మండల విద్యాశాఖ అధికారి యదుసింహరాజు,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆదినారాయణ, ఉపాధ్యాయ బృందం, ఎఎపిసి చైర్ పర్సన్ నాగమణి, గ్రామస్తులు అభినందించారు.