28-06-2025 12:00:00 AM
ఇల్లందులో ఐ ఎఫ్ టి యు పోస్టర్ ఆవిష్కరణ
ఇల్లెందు టౌన్, జూన్ 27 (విజయక్రాంతి): కార్మిక వర్గాన్ని కట్టు బానిసత్వానికి గురిచేసే నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ జులై 9న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం సంపూర్ణంగా పాల్గొని జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కొక్కు సారంగపాణి, తెలంగాణ ప్రగతిశీల ఆటో&మోటర్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోడేటి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
శుక్రవారం ఇల్లెందు ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో నిర్వహించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.కనీస వేతనం నెలకు రూ. 26వేలు ఇవ్వాలని, ప్రభుత్వరంగ పరిశ్రమల అమ్మకాలను ఆపాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, స్కీం వర్కర్లందర్నీ పర్మినెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానపనికి సమానవేతనం అమలు చేయాలని,
అసంఘటితరంగ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఇఎస్ఐ, పెన్షన్ తదితర చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో అన్ని రంగాల కార్మికులు సంపూర్ణంగా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు ఇల్లెందు ఏరియా కమిటీ అధ్యక్షులు డి.మోహన్ రావు, నాయకులు అటికం శేఖర్, మోరె వెంకటేశ్వర్లు, పి. రమేష్, విజయ్, డి.మంగిలాల్ తదితరులు పాల్గొన్నారు.