calender_icon.png 9 February, 2026 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ సందర్భంగా ప్రచార కార్యక్రమాలపై నిషేధం

09-02-2026 12:00:00 AM

పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలి 

నిజామాబాద్, ఫిబ్రవరి 8(విజయ క్రాంతి) : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని అనుసరిస్తూ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీంగల్ పట్టణాలలో ఈ నెల 09వ తేదీ సాయంత్రం 5.00 గంటల నుండి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని, ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్ సమయంలో పై పట్టణాలలో ఎవరు కూడా బహిరంగ ఎన్నికల ప్రచారం చేయరాదని అన్నారు.

ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టి, ఎం.సి.సి బృందాలు, పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. కాగా, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ఈ నెల 9వ తేదీ సోమవారం సాయంత్రం 5.00 గంటల నుండి 11వ తేదీ పోలింగ్ ముగిసేంత వరకు మద్యం షాపులను, కల్లు దుకాణాలను మూసివేయించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు  ప్రక్రియను పురస్కరించుకుని ఈ నెల 13న కూడా మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలని, కౌంటింగ్ ముగిసేంత వరకు డ్రై డే అమలు లో ఉంటుందని తెలిపారు.