02-06-2025 12:00:00 AM
ఖానాపూర్ (విజయక్రాంతి) : మున్సిపాలిటీ కాలనీలలో, గ్రామాల్లో, మైకులతో ప్రచార హోరు దద్దరిల్ల కొడుతున్నారు. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తెల్లవారింది మొదలు పట్టణాలు గ్రామాలు అని తేడా లేకుండా మైకులతో ఈ ప్రచారాలు ప్రజల నెత్తిన భారంగా మారాయి.
వ్యాపారులు వ్యాపారం చేసుకోవడంలో తప్పులేదు కానీ, దద్దరిల్లిపోయే మైకులతో ఆయా కూడళ్లలో ప్రచారం చేసుకుంటే ఏమో అనుకోవ చ్చు కానీ, ఉదయాన్నే వివిధ వ్యాపారస్తులు చిన్న గుండు పిన్నిస్ అమ్ముకునే వారు సైతం చేతిలో సైరన్ లాంటి మైకులు పెట్టుకుని కాలనీలు, నివాసగృహాల్లో ఇళ్లల్లో, గింగురుమని మారుమోగే విధంగా ఈ శబ్ద కాలుష్యంతో ప్రజలు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు.
ఈ విషయం ఎవరికీ ఫిర్యాదు చేయాలో కూడా అంతుచిక్కక బేజారవుతున్నారు. ఈ పరిస్థితి చిరు వ్యాపారులతోనే కలగడం కొంతమేర బాధాకరమే అయినప్పటికీ ,ఈ మైకుల హోరు వల్ల కాలనీలో, గ్రామాల్లో ప్రశాంతత కొరవడుతుంది. దీనికి తోడు ప్రైవేట్ పాఠశాలలు, ఆసుపత్రుల జోరు అంతా ఇంతా కాదు. ఆటోలకు మైకులు ఏర్పాటు చేసి ప్రజల పరిస్థితి కూడా ఆలోచించకుండా శబ్దాలతో దంచి కొడుతున్నారు.
దీంతో వృద్ధులు,చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు పడుతున్న వేదన అరణ్య రోదన అయింది .నిజానికి ఈ మైకు ప్రచారానికి పోలీసులు, మున్సిపాలిటీ శాఖల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉండగా, ఈ చిరు వ్యాపారస్తులు అటువంటిది ఏమీ లేక ఇష్టా రీతిన వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఈ ప్రచారంలో ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఆస్పత్రిల యాజమాన్యం ఉన్నవి లేనివి అబద్ధాలు ప్రచారం చేస్తూ, ప్రజలపై బలవంతపు ప్రచారాలు రుద్దుతున్నారని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా ఇలాంటి మైకుల ప్రచార హోరు నుంచి ప్రజలను కాపాడాలని, వారిని నియంత్రించి శాఖలవారు అనుమతిస్తేనే ప్రచారం చేసుకోవాలని పలువురు అంటున్నారు.
నిజానికి పండుగలు, పెళ్లిళ్లకు డీజేలు మైకులకు అనుమతి అడుగుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని గమనించకపోవడం విడ్డూరమని పలువురు అంటున్నారు. వాటిని నియంత్రించే శాఖలు ఇకనైనా శబ్ద కాలుష్యం నుంచి పట్టణాలు, గ్రామాలను కాపాడేందుకు తగు చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు.క నీసం మైక్ అనుమతి తీసుకోవాలని నిబంధన పెడితే బాగుంటుంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.