02-06-2025 12:02:35 AM
శ్రీచండి ముదిరాజ్ మత్స్యకార సంఘం
ఖైరతాబాద్, జూన్ 1 (విజయ క్రాంతి): ముదిరాజ్ కులస్తులను లను బీసీడీ కేటగిరీ నుంచి బీసీ ఏ కేటగిరీ లోకి మార్చాలని శ్రీచండి ముదిరాజ్ మత్స్యకార సంఘం అధ్యక్షురాలు కోట్ల పుష్పలత ముదిరాజ్ ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ముదిరాజ్లను బీసీడీ నుంచి బీసీ ఏలోకి మార్చాలని డిమాండ్ చేస్తూ గత నెల 29 నుంచి 30వ తేదీ వరకు యాదాద్రి నుంచి గన్ పార్క్ వరకు పాదయాత్ర నిర్వహించానన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
స్వాతంత్య్ర సమరయోధులు పండుగ సాయన్న జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. రంగారెడ్డి జిల్లా ఫారూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామాన్ని మండల కేంద్రంగా అప్ గ్రేడ్ చేయాలని, ఇదే గ్రామంలోని 150 సంవత్సరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దివంగత మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణ రావు చదువుకున్నారని తెలిపారు.
ఈ గ్రామంలో పోలీస్ స్టేషన్, ప్రధానమైన ప్రభుత్వ కార్యాలయాలన్ని ఉన్నాయని, కాని నేటికీ గ్రామంగానే కొనసాగుతుందన్నారు. అనంతరం కోట్ల పుష్పలతను ముదిరాజ్ సంఘం నాయకులు సత్కరించారు. ఈ సమావేశంలో కోట్ల కృష్ణయ్య ముదిరాజ్, శివముదిరాజ్, సాయన్న, ప్రొఫెసర్ మల్లికార్జున్, వెంకటేశ్వర్లు, మాధవి, మాటూరి భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.