కేసులు సత్వరం పరిష్కరించాలి
23-06-2024 02:16 AM
- హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంజీ ప్రియదర్శిని
నాగర్కర్నూల్, జూన్ 22 (విజయక్రాంతి): కేసుల సత్వర పరిష్కారానికి న్యాయమూర్తులు సమిష్టిగా చొరవ చూపాలని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ ఎంజీ ప్రియదర్శిని సూచించారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణంలో జ్యూడిషియల్ హాలు, డిజిటల్ గ్రంథాలయం, మహిళా బార్ అసోషియేషన్ చాంబర్, క్యాంటీన్ను ఆమె ప్రారంభించారు. అనంతరం జిల్లా జడ్జిలతో సమావేశమైన ఆమె.. పలు పెండింగ్ కేసులపై ఆరా తీశారు. జిల్లాలో 14 వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని, అందులో రాజీ అయ్యే కేసులను నేషనల్ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవీదేవి, జిల్లా జడ్జి రాజేశ్ బాబు, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్, బార్ అసోషియోషన్ సభ్యులు పాల్గొన్నారు.






