11-06-2025 12:37:33 AM
బెంగళూరు, జూన్ 10: కర్ణాటక రాష్ట్రంలో మరోసారి కులగణన ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ అధిష్ఠానం మంగళవా రం సూచనలు జారీ చేసింది. కులగణన ప్రక్రియను 60 నుంచి 80 రోజుల్లోగా పూర్తి చేయాలని హైకమాండ్ సిద్ధరామయ్య ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తు తం ఢిల్లీ పర్యటనలో ఉన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నా రు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా సమావేశంలో పాల్గొన్నా రు. ఈ భేటీ అనంతరం కాంగ్రెస్ జాతీ య ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో పరిస్థితులపై సవివరమైన, ఫలవంతమైన చర్చ జరిగిందన్నారు. తాము చర్చించిన ప్రధాన అంశాల్లో కులగణన ఒకటని పేర్కొన్నారు. ఈ అంశంపై జూన్ 12న కర్ణాటక క్యాబినెట్ ప్రత్యేక సమావేశమై చర్చిస్తుందని తెలిపారు.
గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన విధానాన్ని తాము సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నప్పటికీ లెక్కింపు ప్రక్రియకు సంబంధించి కొన్ని వర్గాల్లో ఆందోళనలు ఉన్నాయన్నారు. గతంలో చేపట్టిన కులగణన సమాచారం దాదాపు పదేళ్ల క్రితంది కావడంతో 60 నుంచి 80 రోజుల్లో తిరిగి కులగణన చేపట్టే అంశాన్ని పరిశీలించాలని సీఎం సిద్ధరామయ్యకు సూచించినట్టు తెలిపారు.
గత ఏప్రిల్లో కర్ణాటక ప్రభుత్వం కులగణన సర్వే రిపోర్టును సమర్పించగా, ఇందులో తప్పుడు లెక్కలు ఉన్నాయంటూ లింగాయత్, వొక్కలింగ కమ్యూనిటీలు ఆరోపించాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కులగణన చేపట్టనున్నట్టు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలోనూ 2015లో సిద్ధరామయ్య హయాంలోనే కులగణన జరిగింది.
అప్పటి ప్రభుత్వం వెనుకబడిన వర్గాల కమిషన్ జస్టిస్ కాంతరాజకు కులగణన బాధ్యతలు అప్పజెప్పింది. ఆయన చేసిన సర్వే ఆధారంగా జయప్రకాశ్ హెగ్డే నేతృత్వం లో పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి అప్పటి సర్కారుకు అందించారు. అయితే అప్పుడు సైతం కొన్ని కమ్యూనిటీలను ఇందులో చేర్చడం మరిచిపోయారని, సర్వే తప్పులతడకగా ఉందని ఆరోపణలు వచ్చాయి.
తొక్కిసలాట ఘటన విషాదకరం
ఇదే భేటీలో కర్ణాటకలో ప్రస్తుత రాజకీయాలు, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన అంశాలు కూడా చర్చకు వచ్చాయి. తొక్కిసలాట ఘటన విషాదకరమని వేణుగోపాలు తెలిపారు. ఈ దురదృష్టకర ఘటనలో ఏం జరిగిందో స్పష్టంగా తెలుసుకునేందుకు ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కర్ణాటకను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు.