24-05-2025 01:51:04 AM
-పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్
హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): కుల గణనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందని, రాహుల్గాంధీ ఆశయాలకు అనుగణంగా కుల గణన చేశామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాభవన్లోని ఏఐసీసీ కార్యాలయంలో బీసీ కుల గణపై మహేష్కుమార్గౌడ్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ కార్యక్ర మానికి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ, ఏఐసీసీ నాయకులు జైరాం రమేష్, కొప్పులు రాజు, మధుయాష్కీగౌడ్తో పాటు ఏఐసీసీ అధికార ప్రతినిధులు, మీడి యా ఇన్చార్జ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్కుమార్గౌడ్ మాట్లాడుతూ.. బీసీ కుల గణన హామీతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కుల గణన హామీ ఇవ్వడంతో.. తెలంగాణలో బీసీ సమాజం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కుల గణన విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుని వేగవంతంగా, శాస్త్రీయంగా కుల గణన చపట్టారని తెలిపారు.
ఈ కుల గణన వల్ల రాష్ట్రంలో కులాల వారీగా లెక్కలు తేలాయని, దాంతో ఏ కులానికి ఎంత రిజర్వేషన్లు ఇవ్వాలో తేలిందన్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 42 శాతం చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు వివరించారు. దేశంలో కులగణన నిర్వహించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గర్వకారణమన్నారు.