26-07-2025 05:33:53 PM
బ్యాంకుల వద్ద నిఘా వ్యవస్థను పటిష్ట పరుచుకోవాలి..
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన నేరాలను అరికట్టే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(District SP Rohit Raju) అన్నారు. జిల్లా పరిధిలోని పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, కాలనీలు, ఇండ్ల పరిసరాలలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద సీసీ కెమెరాలతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలన్నారు. కాలనీలు, కమ్యూనిటీలలోకి ప్రవేశించే డెలివరీ బాయ్స్ వివరాలను నమోదు చేసుకున్న తర్వాత మాత్రమే వారిని అనుమతించాలన్నారు. ఇంటి యజమానులు తమ ఇండ్లలో అద్దెకు నివసించే వ్యక్తుల పూర్తి వివరాలను సేకరించుకొని తమ వద్ద పెట్టుకోవాలన్నారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇండ్లలో విలువైన వస్తువులను ఉంచకూడదని, అదే విధంగా ఇరుగు పొరుగు వారికి, స్థానిక పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు.
తమ తమ నివాస ప్రదేశాల్లో అర్ధరాత్రి వేళల్లో ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. తెల్లవారు జామున ఇండ్ల ముందు వాకిలి శుభ్రం చేసేటప్పుడు, రోడ్లపై వాకింగ్ చేసే సమయాల్లో బంగారు ఆభరణాలను ధరించరాదని సూచించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల వల్ల భద్రతా ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. దొంగతనాల నివారణకు, రోడ్డు ప్రమాదాల్లో వాహనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు పోలీసు వారికి ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. పరిశ్రమల యాజమానులు, అన్ని వర్గాల ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరారు. ఇప్పటికే జిల్లాలో నమోదైన చాలా కేసులలో సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలు కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.