17-02-2026 12:01:11 AM
జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు
మెదక్, ఫిబ్రవరి 16(విజయ క్రాంతి) :మెదక్ జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ చైర్మన్ పరోక్ష ఎన్నికలు జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు నిరంతర పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ స్వయంగా తూప్రాన్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అదనపు పోలీస్ బలగాలను మొహరించి, పోలీస్ అధికారులతో సమన్వయం చేస్తూ తక్షణ చర్యలు చేపట్టి శాంతిభద్రతలకు భంగం కలగకుండా పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.
ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగింపు వరకు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు మరియు సమర్థవంతమైన విధుల నిర్వహణ ఫలితంగా మెదక్ జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ సజావుగా, శాంతియుతంగా ముగిసిందని ఆయన వెల్లడించారు.